హైదరాబాద్ ప్రజలకు మరో బాంబ్, మెట్రో ధరల మోత! మే 17 నుంచి ప్రయాణం ఖరీదైనదే!
హైదరాబాద్లో మెట్రో ప్రయాణికులకు షాక్ తగిలింది. ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలను పెంచుతూ అధికారికంగా ప్రకటించింది. మే 17 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు కనిష్ట టికెట్ ధర ₹10 ఉండగా ఇప్పుడు ₹12కి పెంచారు. అలాగే గరిష్ట ధరను ₹60 నుంచి ₹75కు పెంచారు. ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ ధరలు మారనున్నాయి. ఉదాహరణకు, రెండు కిలోమీటర్ల వరకు ₹12, ఆపై దూరానికి అనుగుణంగా ₹30 నుంచి ₹75 వరకు ఛార్జీలు నిర్ణయించారు. ఈ పెంపుతో రోజూ మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు తదితరులపై ఆర్థిక భారం పెరగనుంది. మధ్యతరగతి ప్రజలు ఈ పెంపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఎల్ అండ్ టి సంస్థ ధరలు పెంపు వెనుక కారణంగా నిర్వహణ ఖర్చులు, విద్యుత్ మరియు భద్రతా ఖర్చుల పెరుగుదల ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రజలపై ఈ భారం పడకుండా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. ఇకపై మెట్రో ప్రయాణం చేయాలనుకునే వారు కొత్త ఛార్జీలకు అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.