థియేటర్లపై అకస్మాత్తుగా తనిఖీలు – సినీ రంగంలో కలకలం
రాష్ట్రంలోని పలు నగరాల్లో సినిమా థియేటర్లపై అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మచిలీపట్నం, పాలకొల్లు, నరసరావుపేట, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, జమ్మలమడుగు, రాయచోటి తదితర ప్రాంతాల్లో మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లను అధికారులు పరిశీలించారు.
ఈ తనిఖీల్లో థియేటర్ల టికెట్ ధరలు, తినుబండారాల ధరలు, మరుగుదొడ్లు, ఫైర్ సేఫ్టీ, శుభ్రత, లైసెన్స్లు వంటివన్నీ పరిశీలించారు. దీనితో థియేటర్ యజమానులు ఆందోళనకు గురయ్యారు. “ఇప్పటికే ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు చిన్నపాటి లోపాలను చూపి మూసేస్తామంటున్నారు. మేమెలా నడిపించాలి?” అని వాపోతున్నారు.
ప్రేక్షకులూ తమ అభిప్రాయం చెప్పారు. “మల్టీప్లెక్స్లలో తినుబండారాలు, నీళ్లు చాలా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. నిజంగా పరిశీలించాలంటే అక్కడినుంచే మొదలు పెట్టాలి” అని కొంతమంది చెప్పారు.
ఇక మల్టీప్లెక్స్లకు రెవెన్యూ పంచుకోవడంలో ఎక్కువ శాతం లాభం ఉంటుందని, సింగిల్ స్క్రీన్ యజమానులకు మాత్రం నష్టం ఎక్కువగా వస్తోందని వారు తెలిపారు. మల్టీప్లెక్స్ల మాదిరిగానే శాతం పద్ధతిని తమకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ తనిఖీలు సాధారణ పరిపాలనా చర్యలేనా? లేక రాజకీయ కారణాలా? అనే విషయంపై ఇప్పుడు సినిమా రంగంలో చర్చ జరుగుతోంది.