జగ్గారెడ్డి బీజేపీపై మండిపాటు – కాంగ్రెస్ చరిత్రను విమర్శించడం తగదు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ కుటుంబం మీద బీజేపీ నాయకులు తప్పుగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మంచి మనసున్న, నిజాయితీగల నాయకుడని చెప్పిన జగ్గారెడ్డి, అలాంటి వ్యక్తిని విమర్శించడం సరైన పని కాదన్నారు.
జగ్గారెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల చరిత్ర కలిగిన పాతపార్టీ. బీజేపీ కేవలం 45 ఏళ్ల వయసు గల పార్టీ మాత్రమే. నెహ్రూ, ఇందిరాగాంధీ, మోతీలాల్ నెహ్రూ లాంటి వారు స్వతంత్రం సమరయోధులు. కానీ మోదీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు స్వతంత్రం వచ్చిన తర్వాతే పుట్టారు. అలాంటి వారు చరిత్రను తప్పుగా చూపడం తగదు” అన్నారు.
అలాగే, కాశ్మీర్ను భారత్లో నిలుపుకోవడంలో నెహ్రూ పాత్ర చాలా ముఖ్యమని చెప్పారు. “బీజేపీ నేతలు నెహ్రూని విమర్శించడానికి ముందు చరిత్ర చదవాలి. టైం మిషన్ ఉంటే వాళ్లను వందేళ్ల వెనక్కి పంపించి నెహ్రూ చేసిన పనులు చూపించాలని ఉంది” అని జగ్గారెడ్డి అన్నారు.
తనను పార్టీలో ఏమి భాద్యత ఇస్తేనైనా తీసుకుంటానని, అవసరమైతే గాంధీ భవన్లో అటెండర్గానైనా పని చేస్తానని అన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశం తనకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
జగ్గారెడ్డి మాట్లాడుతూ, కొత్త నాయకత్వం సామాజిక న్యాయాన్ని గౌరవిస్తూ పనిచేస్తోందని, కాంగ్రెస్ మళ్లీ బలపడుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.