హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ మోసం – 350 మందిని మోసగించిన కాకర్ల శ్రీనివాస్ అరెస్టు
హైదరాబాద్లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే సంస్థ పేరుతో నమ్మకంగా మాట్లాడుతూ ప్రజల నుంచి కోట్లు వసూలు చేసిన కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన దాదాపు 350 మందిని మోసం చేసి కోట్ల రూపాయలు తీసుకున్నాడు.
కాకర్ల శ్రీనివాస్ ప్రజలను ఆకర్షించేందుకు “వెంచర్లు, రిసార్ట్స్, అపార్ట్మెంట్లు, మెట్రో స్టేషన్ రెంటల్ ప్లాన్లు” అనే పేర్లతో నకిలీ ప్రాజెక్టులు రూపొందించాడు. రూ.10 లక్షల పెట్టుబడికి 30 శాతం వడ్డీ ఇస్తానంటూ నమ్మబలికాడు. ఒప్పంద పత్రాలు ఇచ్చి, చాలా నమ్మకంగా నటించి డబ్బులు వసూలు చేశాడు. ఈ డబ్బులు ఎటూ కనిపించకుండా చేసేశాడు.
పోలీసుల విచారణలో ఆయన 16 నకిలీ కంపెనీలు పెట్టి వసూళ్లకు ఉపయోగించినట్లు తెలిసింది. గతంలో 2023లో కూడా ఆయన ఇలానే మోసం చేశాడు. అప్పట్లో 20 కోట్ల రూపాయలు వసూలు చేసి అరెస్ట్ అయిన తర్వాత బయటకి వచ్చాడు. కానీ మళ్లీ అదే తరహాలో మోసం చేయడం ప్రారంభించాడు.
ఈసారి “జయ ఇన్ఫ్రా” పేరుతో టెలికాలర్స్ను పెట్టుకుని ప్రజలతో మాట్లాడించాడు. పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పి “ప్రీ లాంచ్ ఆఫర్” పేరుతో డబ్బులు వసూలు చేశాడు. ఇలా మోసపోయిన బాధితులు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు.
పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తూ – “అపరిచిత వ్యక్తులు ఇచ్చే పెట్టుబడి ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి డబ్బులు పెట్టే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవాలి” అని సూచిస్తున్నారు.