నిజాంసాగర్ బ్యాక్వాటర్లో విషాదం – ముగ్గురు యువకులు నీటమునిగి గల్లంతు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదకర ఘటన జరిగింది. సోమార్పేట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్వాటర్లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. క్రికెట్ ఆడిన తర్వాత స్నానం చేయడానికి నీటిలోకి దిగిన వారు ప్రమాదవశాత్తూ మునిగి కనిపించకుండా పోయారు.
గల్లంతైన వారు హర్షవర్ధన్ (16), నవీన్ (17), మధుకర్ గౌడ్ (17). వీరిలో మధుకర్ గౌడ్ మృతదేహం మంగళవారం ఉదయం గజఈతగాళ్ల సహాయంతో వెలికితీయబడింది. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈ ముగ్గురు యువకులు 11 మంది స్నేహితులతో కలిసి సోమవారం మధ్యాహ్నం క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. ఆ తర్వాత ఎండకు అలసిపోయిన వారు దగ్గర్లో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్వాటర్లో ఈతకు దిగారు. అయితే నీటి లోతు అంచనా లేక, ముగ్గురు కొట్టుకుపోయారు.
స్నేహితులు వెంటనే గ్రామానికి వెళ్లి పెద్దలకు సమాచారం అందించారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని గజఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. రాత్రి కారణంగా గాలింపు నిలిపివేయగా, మంగళవారం ఉదయం మళ్ళీ ప్రారంభించి ఒక మృతదేహాన్ని వెలికితీశారు.
ఈ వార్త గ్రామంలో విషాదం నింపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గల్లంతైన యువకుల కోసం బెంగతో ఎదురుచూస్తున్నారు. పోలీసులు మిగతా ఇద్దరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.