అంబటి రాంబాబుపై పోలీసు కేసు – “నాకు భయమా?” అంటున్న మాజీ మంత్రి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. పోలీసులు విధులు నిర్వహిస్తున్న సమయంలో అంబటి హద్దు మీరి ప్రవర్తించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటు దినం” నిరసనలో అంబటి పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసులతో మాటల తూటాలు మారాయి. కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు అంబటి రాంబాబుతో పాటు కొంతమంది వైసీపీ నాయకులపై కేసులు పెట్టారు.
కేసు విషయం తెలిసిన వెంటనే అంబటి స్పందించారు. “నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? నేను కేసులకు భయపడే వ్యక్తిని కాదు,” అంటూ తాను ధైర్యంగా ఉంటానని చెప్పారు. అంతేకాకుండా, “కాపు వర్గానికి చెందినవారిపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారు. అలాంటప్పుడు నన్ను వదిలేస్తారా?” అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో మరో అంశం కూడా చర్చకు వచ్చింది. తుని రైలు దహనం కేసుపై హైకోర్టులో అప్పీల్ చేయాలని రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన జీవోపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చివరకు ఆ జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ, “ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత మంత్రులతో చర్చించాలి” అని అధికారులకు సూచించారు.
ఇక అంబటి రాంబాబు మాత్రం ఈ వ్యవహారాన్ని మళ్లీ గుర్తు చేస్తూ, రాజకీయంగా తాను ఎదుర్కొంటున్న అన్యాయంపై ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.