కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్.
2014 నుంచి 2019 మధ్య కాలంలో అమరావతి నగర నిర్మాణం గురించి భారీ హైప్ ఇచ్చారు. అప్పట్లో ఇది “ప్రపంచ స్థాయి రాజధాని అవుతుంది”, “అక్షయపాత్రలా ఉంటుంది” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే విధంగా ప్రచారం మళ్లీ మొదలైంది. కానీ అప్పట్లో ఆ ప్రచారానికి నమ్మి భూములు కొన్న రైతులు, చిన్నపాటి పెట్టుబడిదారులు ఇంకా ఆర్థికంగా తేరుకోలేదు. మరి ఇప్పుడు మళ్లీ అదే మాయలో పడతారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
తాజాగా చంద్రబాబు ప్రధానమంత్రి మోదీని కలిశారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి ఆహ్వానం పలికారు. ఇది వరకు ఓకే. కానీ దాంతోపాటుగా అమరావతిని “అక్షయపాత్ర”లా తయారుచేస్తాం అని చెప్పినట్టు కథనాల్లో పేర్కొన్నారు. ఇది విద్య, వైద్యం, ఉపాధికి కేంద్రంగా మారుతుందని అన్నారు. కానీ అసలు విషయమేమిటంటే – ఇంత పెద్దగా మాట్లాడిన తరువాత దాని ఖర్చు ఎవరు భరిస్తారు? ప్రజలే కదా!
గతంలో చెప్పినట్టుగా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ కాదని ఇప్పటికే తేలిపోయింది. అంటే, రాష్ట్రం అప్పులు తీసుకోవాల్సిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రుణ భారం ఉంది. ఈ నగరం కోసం తీసే అప్పులను ప్రజలే ఏదో రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ నగర లాభాలు మాత్రం పెద్ద నేతలు, కాంట్రాక్టర్లకు మాత్రమే దక్కేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.
ఒకప్పుడు రూ.2271 కోట్లకు నిర్మిస్తామనుకున్న సచివాలయ భవనాలకు ఇప్పుడు రూ.4688 కోట్లు ఖర్చు అవుతుందట. చదరపు అడుగుకు రూ.8981 ఖర్చు చేస్తామంటున్నారు. హైదరాబాద్లో భూమి ఖరీదు ఉన్నా ఇంత ఖర్చు చేయడం జరగదు అంటున్నారు బిల్డర్లు. కానీ అమరావతిలో భూములు ఉచితం, ఇసుక ఉచితం, ధరలు తక్కువ అయినా ఇంత భారీ వ్యయం ఎందుకంటున్నారు.
ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం 6 లక్షల చదరపు అడుగుల్లో పని చేస్తోంది. దాన్ని డబుల్ చేసి 12 లక్షల చదరపు అడుగుల్లో కొత్త భవనం నిర్మిస్తే చాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు 52 లక్షల చదరపు అడుగుల్లో నాలుగు టవర్లు నిర్మిస్తున్నారట. అవసరాన్ని మించి ఖర్చు ఎందుకు? అన్నది లాజికల్ ప్రశ్న.
గతంలో కూడా తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి వెయ్యి కోట్లు ఖర్చు చేశారు. రెండు వేల కోట్ల అవినీతి జరిగినట్టు కేంద్ర సంస్థలు గుర్తించాయి. కానీ ఆ దర్యాప్తు తర్వాత ఎటూ సాగలేదు. ఇప్పుడు మరోసారి అదే విధంగా పెద్ద మొత్తంలో కాంట్రాక్టులకు ముందుగా డబ్బులు చెల్లించడం, వాటిలో ప్రభుత్వ పెద్దలకు భాగస్వామ్యం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది.
ఈ నిర్మాణాలు, ఖర్చులు, హైప్ అన్నీ చూస్తుంటే ఇది సాధారణ ప్రజలకు కాకుండా పెద్ద కంపెనీలు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు మాత్రమే లాభం చేకూర్చే అమరావతి అని అనిపిస్తోంది. పేదలు, మధ్య తరగతి ప్రజలకు నిజంగా ఉపయోగపడే రాజధాని కావాలంటే, ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాలి.
© APTG360. All Rights Reserved.