చిన్న గ్రామం నుంచి అణు శాస్త్రవేత్తగా ఎదిగిన యువకుడు – సాంబశివరావు గారి కథ
బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం అనే చిన్న గ్రామానికి చెందిన యువకుడు నక్కల సాంబశివరావు తన సాధారణ జీవితాన్ని అసాధారణ విజయంగా మార్చుకున్నాడు. చిన్నతనంలో నుంచే చదువుపై ఆసక్తి ఉన్న సాంబశివరావు ఇప్పుడు భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ అణుశక్తి పరిశోధన సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) లో శాస్త్రవేత్తగా శిక్షణ పొందుతున్నాడు.
సాంబశివరావు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి నాగరాజు ఒక చిన్న రైతు. ఆర్థికంగా బలహీనమైన పరిస్థితులలో కూడా సాంబశివరావు ఎంతో కష్టపడి చదివాడు. పదో తరగతి వరకు బాపట్లలో చదివిన అతను, ఇంటర్మీడియట్ను నాగార్జునసాగర్లో పూర్తి చేశాడు. తర్వాత విజయవాడలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చేశాడు.
బీటెక్ పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా జరిగే GATE మరియు CBT పరీక్షలు రాసి 289వ ర్యాంకు సాధించాడు. తర్వాత BARC సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో విజయవంతంగా పాల్గొని గ్రూప్-A శాస్త్రవేత్తగా ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం అతను 10 నెలల శిక్షణలో ఉన్నాడు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆయన దేశానికి శాస్త్రవేత్తగా సేవలందించనున్నాడు.
అతని విజయానికి ఒక విశేష విషయం ఏమంటే – అతను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. అవసరమైన విషయాలన్నీ ఫోన్లో ఇంటర్నెట్ ఉపయోగించి నేర్చుకున్నాడు. పట్టుదలతో, పట్టింపుతో, సహజమైన తెలివితేటలతో ఈ స్థాయికి ఎదిగాడు.
ఇప్పుడు అతని గ్రామం మొత్తం అతనిని గర్వంగా చూస్తోంది. ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషించబోతున్నాడు. ఇది కేవలం అతని కుటుంబానికి కాదు, గ్రామానికి కూడా గర్వకారణం. కష్టపడే మనసు ఉంటే, ఏ ఊరి నుంచైనా దేశానికి సేవ చేసే స్థాయికి చేరవచ్చని ఈ కథను చూస్తే అర్థమవుతుంది.