ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఏపీ: కాగ్ నివేదిక ఆధారంగా జగన్ విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి అదుపు తప్పిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలు నిజానికి దూరంగా ఉండటాన్ని కాగ్ నివేదికలు స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
జగన్ వ్యాఖ్యానిస్తూ – “రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఆందోళనకరంగా మారాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పింది ఒకటైతే, కాగ్ చూపించిన వాస్తవాలు మరోవైపుగా ఉన్నాయి” అన్నారు.
2025 ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.3,354 కోట్లు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, కాగ్ తెలిపిన లెక్కల ప్రకారం 2024తో పోల్చితే ఆదాయం 24.20% తగ్గింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ ప్రభుత్వ ప్రకటనలపై అనుమానాలు వ్యక్తం చేశారు.
అదే విధంగా, మే నెల జీఎస్టీ ఆదాయం పెరిగిందంటూ ప్రభుత్వం ప్రచారం చేయడం వెనక అసలు ఉద్దేశం ఏప్రిల్ నెల వాస్తవాలను దాచేయడమే అని జగన్ మండిపడ్డారు. కేంద్రం నుంచి సర్దుబాటు కింద వచ్చే మొత్తం రూ.796 కోట్లు తగ్గడం వల్లే ఆదాయం తగ్గిందని చెప్పడం వాస్తవానికి భిన్నమని ఆరోపించారు. “సర్దుబాట్లు చేసిన తర్వాతే నికర ఆదాయం లెక్క వేస్తారు. అందుకే ఈ లెక్కలు మోసపూరితంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు.
కాగ్ నివేదిక ప్రకారం, గతేడాదితో పోల్చితే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 12.21% తగ్గగా, పన్నేతర ఆదాయం 22.01% తగ్గిందని జగన్ తెలిపారు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే విషయమని ఆయన ట్వీట్లో వెల్లడించారు.