కొల్లు రవీంద్ర ఆరోపణలు: మద్యం వ్యాపారం పేరుతో కోట్ల రూపాయల దోపిడీ!
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా విరుచుకుపడ్డారు. మద్యం వ్యాపారం ద్వారా వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని, ఇది పూర్తిగా దోపిడీ మాదిరిగా ఉందని ఆరోపించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు తొలగించి, నగదు రూపంలో రూ.99,413 కోట్లు లావాదేవీలు జరిగాయని చెప్పారు.
అంత పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు ఎందుకు జరిగాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వైసీపీకి ఉందని రవీంద్ర తెలిపారు. వైసీపీ నేతలు మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుని తమ జేబులు నింపుకున్నారని ఆరోపించారు. 2020లో రాష్ట్రంలో 2,934 మద్యం షాపులు ఉన్నప్పటికీ, 2024కి ఇది 3,396కి పెరిగిందని పేర్కొన్నారు. మద్యం తగ్గిస్తున్నామని చెప్ప, నిజానికి మాత్రం దుకాణాల సంఖ్య పెంచారని విమర్శించారు.
2019–24 మధ్య కేవలం 43 మద్యం బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చారని, అవన్నీ వైసీపీ నేతలతో సంబంధం ఉన్న బ్రాండ్లేనని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 300 బ్రాండ్లకు ఆర్డర్లు ఇస్తోందని తెలిపారు.
వైసీపీ నేతలు మద్యం కుంభకోణంలో ఉన్నారని ఆరోపిస్తూ, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వంటి పేర్లను ప్రస్తావించారు. 2019లో వీరు మద్యం వ్యాపారంలో లేకపోయినా, అధికారంలోకి వచ్చిన తర్వాత అందులోకి వచ్చారని విమర్శించారు.
ముఖ్యంగా, 2019లో తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే మద్యం ఆదాయం తేడా రూ.4,186 కోట్లు మాత్రమే ఉంటే, 2024కి ఇది రూ.42,762 కోట్లకు పెరిగిందని తెలిపారు. అంత పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం మద్యం వ్యాపారంలో పారదర్శకత తీసుకొస్తుందని, డిజిటల్ చెల్లింపులను మళ్లీ ప్రారంభిస్తామని కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజల పన్నుల డబ్బు ఎక్కడికి వెళ్తుందో ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.