జగన్పై మంత్రి సత్యప్రసాద్, మంతెన రామరాజు తీవ్ర వ్యాఖ్యలు – వెన్నుపోటు రాజకీయాలపై సంచలనం
ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలో మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి సత్యప్రసాద్, ‘‘జూన్ 4వ తేదీ ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చిన రోజు. ఈ రోజును వైసీపీ నాయకులు పశ్చాత్తాప దినంగా జరుపుకోవాలి’’ అన్నారు. ప్రజలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల మంచి జరుగుతుంటే, వైసీపీ నేతలు అసహనంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ తన కుటుంబంలోని తల్లి, చెల్లెల్లకు కూడా అన్యాయం చేసిన వ్యక్తి, అలాంటి వారిని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఈ విధంగా కొనసాగితే వైసీపీ పూర్తిగా నష్టపోతుందని హెచ్చరించారు.
ఇక పశ్చిమగోదావరి జిల్లాలో మాట్లాడిన మంతెన రామరాజు కూడా జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వెన్నుపోటు రాజకీయాల పద్ధతిని తన తాత రాజారెడ్డి దగ్గర నుంచే నేర్చుకున్నారని ఆరోపించారు. బీసీలకు చెందిన మైన్స్ను లాక్కోవడం, బాబాయిని దూరం పెట్టడం—ఇవి జగన్ చేసిన వెన్నుపోటులే అని చెప్పారు.
‘‘ఒక సంవత్సరం క్రితం రాష్ట్ర పరిస్థితి చాలా చెడు అయింది. కానీ ఇప్పుడు అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే రెండున్నర సంవత్సరాల్లో ఇంకొన్ని మంచి మార్పులు తీసుకురావడమే మా లక్ష్యం’’ అని మంతెన రామరాజు అన్నారు