పేదల ఇంటికే రేషన్ ఇచ్చే సేవను ఎందుకు ఆపారు? – చంద్రబాబు నిర్ణయంపై జగన్ ఆగ్రహం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లిలో మాట్లాడిన ఆయన, రేషన్ను ఇంటికే అందించే డోర్డెలివరీ విధానాన్ని రద్దు చేయడాన్ని తప్పుపట్టారు.
ఇళ్లకే వచ్చిన సేవలను వెనక్కి తీసుకెళ్లడమేంటీ?
మా ప్రభుత్వంలో పేదలకు ఇబ్బంది కాకుండా ఇంటికే నాణ్యమైన బియ్యం పంపించే విధానాన్ని ప్రారంభించాం. దీని వల్ల వారు క్యూలైన్లలో నిలబడి కష్టపడాల్సిన అవసరం లేకుండా చేసింది. కానీ ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ సేవను రద్దు చేసింది. ఇది ప్రజల మీద కక్షగానే అనిపిస్తోంది.
వాహనాలు తీసేశారా? ఉద్యోగాలెక్కడ?
రాష్ట్రవ్యాప్తంగా 9,260 రేషన్ వాహనాలు పేదల ఇళ్లకి బియ్యం అందించేవి. వాటిపై ఆధారపడిన 20 వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. “ఇంటికే రేషన్ వస్తుందన్న ఆనందం క్షణాల్లో మాయమైంది. కనీసం వాహనాల్ని తీసేస్తూ, వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం చూసిన పరిస్థితి కూడా లేదు,” అని జగన్ అన్నారు.
వాలంటీర్లకు ఏమైంది?
“ఎన్నికల ముందు వాలంటీర్లకు మద్దతు ఇస్తామన్నారు. నెలకు రూ.10,000 ఇస్తామన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాళ్లను బదిలీ చేయడం కాదు, ఉద్యోగాలే తీసేశారు. సచివాలయాల్లో పనిచేసే వేల మందికి భవిష్యత్తు చూపకుండా రోడ్డుమీద నిలబెట్టారు,” అని విమర్శించారు.
పల్లెల్లో సేవలు కరువవుతున్నాయా?
గ్రామాల్లో క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ల సేవలు, ఆర్బీకేలు, సచివాలయ వ్యవస్థ… ఇవన్నీ తగ్గిస్తూ, ప్రజలకి అందే ప్రభుత్వ సేవలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు.
“ఈ నిర్ణయాలు ప్రజల జీవితం మీదే ప్రభావం చూపుతున్నాయి”
మీ నిర్ణయాల వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు పోయి చాలా కుటుంబాలు బాదలో ఉన్నాయి. దయచేసి మానవత్వంతో ఆలోచించండి.