ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు మరోసారి మీడియా స్వేచ్ఛపై చర్చకు దారితీసింది. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసానికి మఫ్టీలో వచ్చిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఆయనను అరెస్టు చేసి ఏపీకి తరలించారు. ఆయనపై అమరావతి మహిళలను కించపరిచిన కేసులో చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆయన్ను అదుపులోకి తీసుకునేటప్పుడు ఎఫ్ఐఆర్ మాత్రమే ఉందని పోలీసులు పేర్కొన్నప్పటికీ, కేసు వివరాల్ని వెల్లడించలేదని సమాచారం.
ఈ అరెస్టుపై కొమ్మినేని తీవ్రంగా స్పందించారు. “నేను ఓ సీనియర్ జర్నలిస్టును. ప్రశ్నించే హక్కును ఇలా అణిచేస్తారా? నన్ను రెడ్ బుక్లో చేర్చారని చెబుతున్నారు. ఇది ప్రభుత్వం నాపై ఉన్న కక్షసాధింపు చర్య. నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నా. జర్నలిస్టులను ఈ విధంగా అరెస్ట్ చేస్తే, సామాన్యుల పరిస్థితి ఏమిటి?” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసుకు మూలకారణం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో చోటుచేసుకున్న అభ్యంతరకర వ్యాఖ్యలే. చర్చలో పాల్గొన్న మరో జర్నలిస్టు కృష్ణంరాజు, అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొన్నట్టు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. రాజధాని రైతులు, మహిళా సంఘాలు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావును కూడా చేర్చారు. అంతేకాకుండా, వ్యాఖ్యలు ప్రసారం చేసిన సాక్షి టీవీ యాజమాన్యంపైనా కేసు నమోదైంది.
ఇకపోతే, సాక్షి టీవీ ఇప్పటికే ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. “ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతవే, సంస్థకు సంబంధం లేదు. మహిళల పట్ల గౌరవమే మాది, అవమానం చేసే ఉద్దేశం ఏనాడూ లేదు” అంటూ స్పందించింది.
ఇదే సమయంలో, కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐటీ యాక్ట్, బీఎన్ఎస్ తదితర పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సంఘటనపై స్పందిస్తున్న పలువురు జర్నలిస్టులు, మేధావులు, పౌరహక్కుల కార్యకర్తలు – ఈ అరెస్టు మీడియా స్వేచ్ఛను భయపెట్టే ప్రయత్నమేనని అభిప్రాయపడుతున్నారు. విమర్శలకు అడ్డుకట్ట వేసే క్రమంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారం ఎలా పరిణమిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
Sr Journalists Kommineni Srinivas Rao of #SakshiTV which is owned by #YSJagan arrested by the Andhra police in #Hyderabad. FIR registered under Tullur Police Station.
— Sowmith Yakkati (@YakkatiSowmith) June 9, 2025
FIR has been registered against Kommineni Srinivas Rao, Krishnam Raju and Sakshi TV management for making… pic.twitter.com/B05FaSi437
© APTG360. All Rights Reserved.