తిరుమలకు కాలినడకగా వచ్చే భక్తులకు ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు
తిరుపతి – తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకగా వచ్చే భక్తులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) శుభవార్త చెప్పింది. భక్తుల ప్రయాణం సులభంగా సాగేందుకు ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయం మేరకు, తిరుపతి రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ నుంచి అలిపిరి వరకు 20 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితంగా నడపనున్నట్టు సమాచారం. ఈ బస్సులు ప్రత్యేకంగా కాలినడక భక్తుల కోసం ఉంటాయి, వారు అలిపిరి గుండా శ్రీవారి మెట్టు మార్గంలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి.
ఇప్పటికే కొన్ని ఉచిత ధర్మరథ బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ, భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అవి సరిపోవడం లేదు. ఆటో, టాక్సీలపై భక్తులు అధిక డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే ఈ కొత్త బస్సులు అందుబాటులోకి తేవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. బస్సుల కొనుగోలుకు దాతల సహకారాన్ని తీసుకునే విషయాన్ని ధర్మకర్తల మండలిలో చర్చించనున్నారు.