నెల్లూరులో వైసీపీకి షాక్: 1500 మంది నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరబోతున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లాలో పెద్ద దెబ్బ తగిలింది. కోవూరు మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 1500 మందికిపైగా వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
మానేగుంట, రామన్నపాళెం, రెడ్డిపాళెం, కమ్మపాళెం పంచాయతీలలోని గ్రామాల్లో వైసీపీ నేతలపై అసంతృప్తి పెరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై అక్కడి కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో పెద్ద సంఖ్యలో వారు టీడీపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నేత నాపా వెంకటేశ్వర్లు నాయుడు కలిసి ఆ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
2019లో 151 స్థానాలు గెలిచి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ, 2024లో కేవలం 11 స్థానాలతో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి తర్వాత పార్టీపై అసంతృప్తి రోజురోజుకీ పెరుగుతోంది.
ఇంతలోనే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం తప్పుగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయాలని తన అభిప్రాయాన్ని జగన్కు తెలియజేస్తానని చెప్పారు.
ఈ పరిణామాలతో నెల్లూరు జిల్లాలో వైసీపీ బలహీనపడుతోంది. పార్టీ ఓటమి, నాయకుల మారుతున్న తీరు చూస్తే వైసీపీకి కష్టకాలం మొదలైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.