ప్రభుత్వ విద్యను ప్రైవేటు స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముందడుగు: మంత్రి లోకేశ్
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకన్నా మెరుగ్గా మారాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా అనేక మార్పులు చేస్తున్నామని అన్నారు.
‘షైనింగ్ స్టార్స్ అవార్డులు – 2025’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన 95 మంది విద్యార్థులు, ఇంటర్ పరీక్షల్లో మెరిసిన 26 మందికి అవార్డులు ఇచ్చారు. ఒక్కో విద్యార్థికి రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, గౌరవపత్రం అందించారు.
లోకేశ్ మాట్లాడుతూ, “మొదటి విడతగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాం. ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఇస్తున్నాం. ఇది మొదటి అడుగు మాత్రమే. చదువు వల్లే జీవితం మారుతుంది. మీలోని ప్రతిభను నేను గుర్తిస్తాను. మీరు ఉన్నత చదువులు చదివి, మీ పాఠశాలకి తిరిగి సేవ చేయాలి,” అన్నారు.
“డ్రగ్స్ వంటి విషపు అలవాట్లను ప్రభుత్వం తీవ్రంగా ఎదురుకుంటోంది. తప్పు చేస్తే మీ కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతుంది. చదువుతోనే పేదరికాన్ని అధిగమించవచ్చు. నేనే ఉదాహరణ – ఓడిపోయినా మళ్లీ గెలిచాను. కష్టపడి ప్రయత్నిస్తే మీరు కూడా ఏదైనా సాధించవచ్చు.”
ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత కూడా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, “ప్రభుత్వం విద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తోంది. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థినులకు పూర్తిగా భద్రత కల్పిస్తున్నాం. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రోత్సహించాలి” అని చెప్పారు.