బండారు బ్రదర్స్పై చిర్ల జగ్గిరెడ్డి సంచలన ఆరోపణలు: “అవినీతి పిరమిడ్ నిర్మించారు!”
అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, బండారు బ్రదర్స్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కలిసి “భరతభూమికి తక్కువ కాకుండా అవినీతి పిరమిడ్ నిర్మించారని” ఆయన ఘాటుగా విమర్శించారు.
రావులపాలెంలో మీడియాతో మాట్లాడిన జగ్గిరెడ్డి, “వారి అవినీతిని చూసి గిన్నిస్ బుక్ వాళ్లు కూడా ఆశ్చర్యపోతారు. అవినీతి విభాగంలో రికార్డు పెట్టే స్థాయిలో వారు పనిచేశారు” అని వ్యాఖ్యానించారు. “బండారు బ్రదర్స్ పెట్టిన ఇసుక కొండలు చూస్తే ప్రపంచంలో ఎనిమిదవ వింతగా పరిగణించవచ్చు. ఇది ప్రజాధనాన్ని దోచుకునే పెద్ద స్కాం” అని ఆయన అన్నారు. వారు అవినీతి లేనివారైతే వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు.
“బెల్ట్ షాపుల ద్వారా వసూలు చేస్తున్న బీటాక్స్ గురించి ఇప్పుడే ప్రజలు పెద్దగా మాట్లాడడం లేదు. అది అందరికీ తెలిసిన రహస్యమే. బండారు బ్రదర్స్ ఇద్దరిలో బ్రహ్మానందం ఎవరో, అలీ ఎవరో ప్రజలే తేల్చాలి” అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, “వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలు – అమ్మఒడి, చేయూత, కాపు నేస్తం లాంటి పథకాల వల్ల రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రజలకు మోసమే మిగిలింది. పథకాలు అమలు చేస్తున్నట్లు చూపించి, మళ్లీ అదే మోసం చేస్తున్నారు” అని ఆరోపించారు.
‘తల్లికి వందనం’ పథకాన్ని కూడా జగ్గిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చే పథకాలు ప్రజల్ని మోసం చేయడానికి కవరుగా ఉంటాయని ఆరోపించారు. గతంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన సహాయ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని, వాటిని కొనసాగించడంలో ఇప్పటి ప్రభుత్వం వైఫల్యం పాలైందని విమర్శించారు.
తన ఆరోపణలకు ఆధారాలు చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. బండారు బ్రదర్స్ అవినీతి చరిత్రపై ప్రజలకు నిజం తెలియాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.