బక్రీద్ సందర్భంగా ఆవులు, ఒంటెలను వధిస్తే కఠిన చర్యలు: పశుసంవర్ధక శాఖ
బక్రీద్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కీలక సూచనలు చేసింది. ఆవులు, దూడలు, ఒంటెలను వధించడం రాష్ట్రంలో పూర్తిగా నిషేధించబడిందని, ఎవరైనా ఈ జంతువులను బలికిస్తే జంతు సంరక్షణ చట్టం మరియు గోవధ నిషేధ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు స్పష్టం చేశారు. ప్రజలంతా చట్టాలను గౌరవిస్తూ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పండుగ రోజుల్లో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయంగా వ్యవహరించి పశుసంవర్ధకశాఖ చర్యలు తీసుకోనుంది. ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలనీ, ఎవరైనా ఉల్లంఘిస్తే తగిన శిక్షలు అనివార్యమవుతాయని హెచ్చరించారు. ప్రజల సహకారంతో పండుగను చట్టబద్ధంగా జరుపుకోవాలని అధికారులు కోరుతున్నారు.