వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ – అసదుద్దీన్ ఒవైసీ, రెహమానీ పిలుపు
వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ ఖలీద్ సైఫుల్లా రెహమానీ డిమాండ్ చేశారు. ముస్లింల హక్కులను కాపాడేందుకు ప్రజలందరూ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని వారు కోరారు.
బుధవారం రాత్రి నల్లగొండలోని క్లాక్టవర్ సెంటర్ వద్ద జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. వక్ఫ్ చట్టం ముస్లింల భూములను, హక్కులను కాపాడేలా ఉండాలి కానీ, ఇప్పటి చట్టం వాటిని అట్టడుగు చేసేదిగా ఉందన్నారు.
అసదుద్దీన్ మాట్లాడుతూ, దేశంలోని ముస్లింలపై అన్యాయాలు జరుగుతున్నాయని, వారి హక్కులను కాలరాసే విధంగా కొత్త చట్టాలు వస్తున్నాయన్నారు. బంగ్లాదేశ్ పేరుతో వేల మంది ముస్లింలను అరెస్ట్ చేశారని, మదర్సాలు మూసివేస్తున్నారని, పేద ముస్లింల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చుతున్నారని ఆరోపించారు.
ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా ప్రతి ముస్లిం స్పందించాలని, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మే 25న మానవహారం, జూన్ 1న ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు తెలిపారు.
ఈ సభలో కాంగ్రెస్ నేత గుమ్ముల మోహన్రెడ్డి, సీపీఎం నేత తుమ్మల వీరారెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. సభ ముందు నల్లగొండ పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమం నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సహా కొంతమంది బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది.