జగిత్యాల గురుకుల పాఠశాలలో బాలికపై లైంగికదాడి – లెక్చరర్పై కేసు
జగిత్యాల జిల్లాలోని ఓ బాలికల గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదో తరగతిలో చదువుతున్న చిన్నారిపై అక్కడ పని చేస్తున్న ఓ లెక్చరర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత నెల 5న బాలిక రజస్వల అయిందని స్కూల్లోని క్రీడా ఉపాధ్యాయురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో వారు వచ్చి బాలికను ఇంటికి తీసుకెళ్లారు. అదే నెల 12న పరీక్షలు రాయడానికి ఆమెను తిరిగి స్కూల్కి పంపించారు.
తర్వాత వేసవి సెలవుల్లో భాగంగా మే 23న బాలికను తిరిగి ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు, ఆమె కడుపునొప్పితో బాధపడుతుండటాన్ని గమనించారు. వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలలో బాలిక రజస్వల కాలేదని తెలిసింది. ఇది చూసిన వైద్యురాలు ఏదైనా తప్పిదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేయడంతో, తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించారు. అప్పుడే బాలిక ఓ లెక్చరర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు మే 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని న్యాయస్థానానికి హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
ఈ ఘటనపై జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారులు (DSWO) బుధవారం స్కూల్కి వెళ్లి విచారణ చేపట్టారు. తల్లిదండ్రుల కమిటీ సభ్యులు తీవ్రంగా స్పందిస్తూ, నిందితుడిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని, ఆయనకు సహకరించినవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాలికల భద్రత కోసం పాఠశాలల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు.