గచ్చిబౌలిలో రన్నింగ్ కారులో మంటలు – ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు
హైదరాబాద్ గచ్చిబౌలిలో మంగళవారం ఉదయం ఓ కారు రన్నింగ్లో ఉండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం సైబరాబాద్ పోలీస్ కార్యాలయం ఎదుట జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సమయానికి కారు నుంచి బయటకు రావడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు.
కారు ఇంజన్ నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కారు ఆపి దిగిపోయారు. కొన్ని నిమిషాల్లోనే మంటలు కారు మొత్తాన్ని చుట్టేసి పూర్తిగా కాల్చేశాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే వారు అక్కడికి చేరుకునేసరికి కారు ఇప్పటికే పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇటువంటి ఘటన ఇదే తొలిసారి కాదు. ఇదివరకు కూడా మే 17న గచ్చిబౌలిలో మరో కారు రన్నింగ్లో ఉండగా మంటలు చెలరేగాయి. ఆ ఘటనలో కూడా డ్రైవర్ సకాలంలో బయటపడటంతో ప్రమాదం తప్పింది.
ప్రస్తుతం ఈ ప్రమాదానికి కారణం ఏమిటో తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు ప్రజలకు సూచిస్తూ, డ్రైవింగ్ సమయంలో వాహనంలో ఏవైనా సమస్యలు కనిపిస్తే వెంటనే కారు ఆపి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.