గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్పై సీబీఐకు అభ్యంతరం – హైకోర్టులో కౌంటర్
ఓబుళాపురం మైనింగ్ కేసులో శిక్ష పడిన ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించాలంటూ సీబీఐ అభ్యంతరం తెలిపింది. ఆయన శిక్షను నిలిపివేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, హైకోర్టులో కౌంటర్ పత్రాలు దాఖలు చేసింది.
గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా మరికొందరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ గాలి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని, శిక్షను తాత్కాలికంగా ఆపాలని కోరారు. అయితే ఈ నేపథ్యంలో సీబీఐ తాజాగా స్పందించింది.
సీబీఐ అభిప్రాయం ప్రకారం, గాలి తన నియోజకవర్గానికి శిక్ష వల్ల నష్టం జరుగుతుందన్న విషయాన్ని సరిగ్గా వివరించలేకపోయారు. ప్రజాప్రతినిధిగా ఉండటం అన్నది మౌలిక హక్కు కాదని, శిక్షను ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
గాలి జనార్దన్ రెడ్డి సహా ఇతర నిందితుల పిటిషన్లకు న్యాయబద్ధత లేదని పేర్కొంటూ, అవి కొట్టివేయాలంటూ హైకోర్టును కోరింది. ఈ కేసుపై హైకోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది.