తన కుమార్తెను ఇండియాకు రప్పించండి: తండ్రి ప్రభుత్వానికి విజ్ఞప్తి
అమెరికాలో ఉన్న తన కుమార్తెకు న్యాయం చేయాలని, ఆమెను ఇండియాకు రప్పించాలని గులాం అఫ్జల్ అనే తండ్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకున్నారు.
శుక్రవారం సోమాజిగూడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన కుమార్తె ఫాతిమా హస్నా 2007లో డాక్టర్ డబీరుద్దీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పారు. పెళ్లైన తర్వాత ఆమె అమెరికాకు వెళ్లిందని, మొదటి కొన్ని రోజులపాటు జీవితం బాగానే సాగిందని తెలిపారు.
ఆ తర్వాత డబీరుద్దీన్ నిజమైన ఉద్దేశ్యం బయటపడిందని, అతడు అమెరికాకు వెళ్లడానికే ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడని అర్థమై ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెప్పారు. తల్లి ఫాతిమా భారతదేశానికి వచ్చి విడాకులు తీసుకుందని తెలిపారు.
ఆమె తర్వాత ఉద్యోగం కోసం తిరిగి అమెరికా వెళ్లినప్పుడు డబీరుద్దీన్ ఆమెపై అక్కడ తప్పుడు కేసులు వేసినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం, ఆమె అతనికి భరణం కూడా చెల్లిస్తున్నదని అన్నారు. దీంతో గత 10 ఏళ్లుగా ఆమె అక్కడే ఉండిపోగా, కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందన్నారు.
ఇప్పటి పరిస్థితుల్లో ఆమె ఇండియాకు రాలేకపోతున్నదని, తాను తన పింఛన్ డబ్బులు కూడా పంపాల్సి వస్తున్నదని చెప్పారు. ఫాతిమాను ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని, డబీరుద్దీన్ను కూడా ఇక్కడి కేసుల విషయంపై విచారణ చేయాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.