తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన – సెల్ఫోన్ విషయంలో స్నేహితుడిని చంపారు
తూర్పు గోదావరి జిల్లాలో ఒక చిన్న విషయంపై గొడవ తలెత్తి, చివరికి ఒక యువకుడి హత్యతో ముగిసిన ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న సెల్ఫోన్ విషయంపై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
మృతుడు చిన్నబ్బులు (32), రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరానికి చెందినవారు. అతడు తన బాల్య స్నేహితులతో (సింహా దుర్గాసాయి, శెట్టి వీరబాబు, ఆకుల గణేశ్, కర్రి శ్రీనివాస్ రెడ్డి, రేలంగి సాయి మణికంఠ అలియాస్ తరుణ్)కలిసి ఈవెంట్లు, కార్పెంటర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు.
జూన్ 4న, చిన్నబ్బులు తన స్నేహితులతో కలిసి రాజమహేంద్రవరం రివర్బే వద్ద మద్యం తాగుతూ పార్టీ చేశాడు. ఆ సమయంలో వీరబాబు సెల్ఫోన్ చిన్నబ్బులు చేతిలో ఉండగా అది కింద పడిపోయి స్క్రీన్ పగిలింది. దీని వల్ల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అంతటితో ఆగకుండా, అదేరోజు సాయంత్రం మళ్లీ అందరూ కలిసి మద్యం తాగేందుకు కోరుకొండ మండలంలోని నిడిగట్ల రోడ్డుకు వెళ్లారు.
అక్కడ మళ్లీ ఫోన్ విషయం రాక, చిన్నబ్బులుపై మిగిలిన ఐదుగురు కలిసి దాడి చేశారు. బ్లేడ్తో గాయపరిచి, రాళ్లతో కొట్టి, అతన్ని అక్కడికక్కడే హత్య చేశారు. అనంతరం అతని శవాన్ని డ్రైన్లో పడేశారు.
ఈ ఘటనపై స్థానిక వీఆర్వో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, కేసు నమోదు చేసి పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యలో ఉపయోగించిన బ్లేడ్, సెల్ఫోన్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు.
డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు – నిందితులందరూ గతంలోనూ నేరాలకి సంబంధించి పోలీసుల దృష్టిలో ఉన్నవారని. ఒక చిన్న విషయంపై ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.