వై మీడియాకు అక్రమ చెల్లింపులు చేశారంటూ ఆరోపణ: లంకా దినకర్
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో “వై మీడియా” అనే ప్రైవేట్ సంస్థకు సర్ప్ (SERP) ద్వారా రూ.96 కోట్లను అక్రమంగా చెల్లించారని రాష్ట్ర ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆరోపించారు. ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో ఈ నిధులు చెల్లించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.
అమరావతిలో విలేకరులతో మాట్లాడిన లంకా దినకర్, “ఈ విషయం ఇప్పుడు విచారణలో ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం,” అని స్పష్టంగా తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పలు సంక్షేమ పథకాల అమలుపై 26 జిల్లాల్లో నిర్వహించిన సమీక్ష వివరాలు కూడా ఆయన వెల్లడించారు.
డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడి ఏడాది కావడంతో కేంద్రం మంజూరు చేసిన 2.61 లక్షల టిడ్కో ఇళ్లలో కేవలం 1.40 లక్షల ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు అప్పగించారని, అందులో ఉన్నవారు 87 వేల మందికే పరిమితమయ్యారన్నారు.
అలాగే, జల్ జీవన్ మిషన్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, తాగునీటి పనుల్లో నాణ్యత లేకుండా వ్యవహరించారని విమర్శించారు. రాబోయే రోజుల్లో 97 లక్షల గ్రామీణ ఇళ్లకు శుద్ధమైన తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలిపారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో పాత ప్రభుత్వ కాలంలో జరిగిన నిధుల వినియోగంపై మరిన్ని వివరాలు వెలుగు చూడనున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.