9వ తరగతి బాలికపై దారుణం – ఆరో నెల గర్భవతిగా బయటపడిన ఘటన
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో ఓ దళిత బాలికపై తీవ్ర అమానుషం జరిగింది. 9వ తరగతి చదువుతోన్న ఈ బాలికను ఆరుగురు యువకులు మాయమాటలు చెప్పి లొంగదీశారు. ఆ తర్వాత ఆమెపై వారు లైంగిక దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన గురించి బాలిక ఎవరికీ చెప్పలేదు. కానీ ఇటీవల ఆమె ఆరోగ్యం బాగా పడిపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి ఆమెకు ఆరో నెల గర్భం ఉన్నట్లు వెల్లడించారు. దాంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి బాలికను నిలదీయగా, ఆమె జరిగిన విషయం చెప్పింది.
తర్వాత వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలిక చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేశారు. నిందితులుగా ఉన్న ఆరుగురిని గుర్తించారు. వాళ్లంతా అదే గ్రామం లేదా పక్క గ్రామాలవారుగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆ యువకులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వివరాలు తెలుసుకుంటున్నారు.
ఈ ఘటనపై గ్రామంలో ఆవేదన వ్యక్తమవుతోంది. బాలికకు న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు.