మన రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రకటించిన నాటి నుంచి, అంటే సుమారు పదేళ్ల క్రితం నుంచి, రెండు రోజుల క్రితం సాక్షి టీవీ డిబేట్లో చేసిన వ్యాఖ్యల వరకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం, అమరావతి పట్ల వారికున్న విద్వేషం, విషం ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అమరావతిలోని ప్రజలు చంద్రబాబు గారి కుటుంబ సభ్యులా? కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళా? లేక కమ్మ సామాజిక వర్గం వాళ్ళా? కాదు కదా. రాజధాని నిర్మాణానికి మొత్తం 33 వేల మంది రైతులు భూములు ఇస్తే, అందులో 20,490 మందికి ఎకరం లోపు భూములే ఉన్నాయి. అంటే వారందరూ చిన్న, సన్నకారు రైతులు, మధ్యతరగతి దిగువన ఉన్నవారు. అలాంటి వారిని పట్టుకుని “పెత్తందారులు” అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత కూడా అసెంబ్లీలో అదే మాట అన్నారు. ఆ భూములు ఇచ్చిన 33 వేల మంది రైతుల్లో 70% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. కానీ వారిని, ఆ ప్రాంతాన్ని పట్టుకుని “కమ్మరావతి, కమ్మరావతి” అని ప్రచారం మొదలు పెట్టారు. ఇది ఎంత అన్యాయం?
2019కి ముందు, అంటే అధికారంలోకి రాకముందు, “ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఒకే సామాజిక వర్గం దోచుకుంటున్నారు” అని ప్రచారం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇన్సైడర్ ట్రేడింగ్ నిరూపించలేకపోయారు. అవినీతి నిరూపించలేదు. ఏమీ నిరూపించలేదు. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. కేవలం రాజధాని నిర్మాణం ఆపేశారు. భూములు ఇచ్చిన రైతులను ఇబ్బంది పెట్టారు. వారి కళ్ళలో నీళ్లు నిండటానికి కారణమయ్యారు. వారి జీవితాలను నాశనం చేశారు. ఒక రకంగా, వారి జీవిత కాలంలో ఐదేళ్లు విపరీతమైన మానసిక క్షోభను అనుభవించేలా చేశారు.
వారు కూడా మొండిగానే పోరాడారు. ఆ ఐదేళ్ల కాలంలో వారిపై కేసులు పెట్టారు, వేధించారు. “పెయిడ్ ఆర్టిస్టులు” అన్నారు కొందరు. సజ్జల రామకృష్ణ రెడ్డి గారి లాంటి వారు “మొహానికి రంగులు వేసుకొని వచ్చేస్తారు వీళ్ళందరూ కూర్చోడానికి, ఉద్యమం చేయడానికి” అన్నారు. ఇంకొకాయన “వాళ్ళందరూ ఒళ్ళు బొలిసి కొట్టుకుంటున్నారు, వాళ్ళకి తిన్నది అరక్క కూర్చుంటున్నారు” అని వ్యాఖ్యానించారు. మరొకరు “ఇదేమి రాజధాని కాదు, ఇదంతా కూడా ఒక స్మశానం” అని అన్నారు.
ఈ మాటలు అన్నోళ్ళందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తలు కాదు. రాష్ట్ర స్థాయిలో, క్యాబినెట్ స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో ఉన్న పెద్దలు. సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, నందిగం సురేష్ లాంటి వారు – జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు చేసిన వ్యాఖ్యలివి. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని, అమరావతిని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన కామెంట్లు ఇవి.
సరే, అధికారం కోల్పోయారు. “రాజధాని వికేంద్రీకరణ” అనే ఆట ఆడారు. “మూడు రాజధానులు” అన్నారు. “విశాఖపట్నం నుంచే నేను పరిపాలిస్తాను” అని, “విశాఖపట్నానికి ఎంతో చేస్తాను, ఇక్కడి నుంచే సీఎం గా పరిపాలన ప్రారంభిస్తాను, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను” అని విశాఖపట్నం వాసులకు కబుర్లు చెప్పారు. 2020 నుంచి 2024 వరకు కూడా “ఉగాది నుంచి విశాఖ పరిపాలనా రాజధాని, దసరా నుంచి విశాఖ పరిపాలనా రాజధాని” అని ప్రతి సంవత్సరం ఉగాది, దసరా, ఉగాది, దసరా అంటూ అలా నాలుగేళ్లు గడిపేశారు.
అది పరిపాలనా రాజధాని అవ్వలేదు. అక్కడ పరిపాలన వెళ్లలేదు. కనీసం అభివృద్ధి జరగలేదు. ప్రాజెక్టులు రాలేదు. ఏమీ చేయలేదు. అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. దాదాపుగా 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక రాజభవనం నిర్మించారు. ఒక కమోడ్ కట్టడానికి పాతిక లక్షలు, ఒక బాత్ టబ్కేమో ఒక 30 లక్షలు – లక్షలకు లక్షలు, కోట్లు కోట్లు తగలేసి కట్టారు. ప్రజలకు ఏమైనా ఉపయోగమా? రాష్ట్రానికి ఉపయోగమా? ఆ భవనం వలన ఏమీ లేదు. ప్రజాధనం వృధా అయిపోయింది.
ప్రజలు ఓడించారు. “మీ రాజధాని డ్రామాలకు దండం బాబు” అని చెప్పి ప్రజలు ఓడించారు. ఆ ప్రాంతంలో కూడా ఓడించారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అధికారం కోల్పోయిన తర్వాత, “అరే, రాజధాని విషయంలో తప్పు జరిగిందేమో, మేము తప్పుగా మాట్లాడామేమో, తప్పు నిర్ణయం తీసుకున్నామేమో, ప్రజలు ఏ ప్రాంతంలో కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు కదా” అని ఆలోచన మారి, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల గారు, బొత్స గారు లాంటి పెద్దలు ఒక 10 మందో, 15 మందో కూర్చొని సమీక్షించుకోవచ్చు కదా? అసలు రాజధాని విషయంలో ఏం చేశాం మనం? విధానపరమైన నిర్ణయం మారాలా అని పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉన్న 33 మందితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా? “రాజధాని విషయంలో మేము ఇలా తప్పుడు ప్రకటన చేశాం, సో రాజధాని విషయంలో మేము పునరాలోచిస్తాం” అని ఒక మాట చెప్తే అయిపోయేది.
కానీ లేదు, అహం అడ్డు వచ్చింది. “అసలు రాజధాని నాశనం అయిపోవాలి, ఈ రాష్ట్రంలో రాజధాని ఉండకూడదు, ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు” అనే ఆలోచన వికృత రూపంలోకి వచ్చి, రాజధానిని “వేశ్యల రాజధాని” అనే వరకు వచ్చింది.
2015లో మొదలైన విద్వేషం, 2015లో మొదలైన విషం చిమ్మడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 10 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఈ పదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు అధికారంలో ఉంది, నాలుగేళ్ళు ప్రతిపక్షంలో ఉంది, ఒక సంవత్సరం విపక్షంలో ఉంది (ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు). ఇటువంటి పరిపాలన వలనే కదా? మరి దీని నుంచి ఏమైనా బుద్ధి వచ్చిందా అంటే ఏమీ రాలేదు.
అంటే ఇక్కడ ఎవరు మారాలి? ఎవరు ఆలోచించాలి? ఎవరిది తప్పు? ఎవరి ఆలోచన వికృతంగా ఉంది? ఎందుకు అంత విషమైన ఆలోచనలు? ఎందుకు అంత వికృతమైన ఆలోచనలు? ఇక్కడ ఆలోచించాల్సింది గానీ, కూర్చోవాల్సింది గానీ, నిర్ణయం తీసుకోవాల్సింది గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. కొన్ని కొన్ని వివాదాల జోలికి వెళ్ళకూడదు. కొన్ని విషయాలు ఉంటాయి, వాటి జోలికి మనం వెళ్ళకూడదు. వెళ్తే పతనం అయిపోతారు.
అలా మన రాష్ట్రంలో రాజధాని అటువంటిదే. దాని జోలికి వెళ్ళకూడదు, వెళ్తే పతనం అయిపోతారు. ఎందుకంటే మనకు రాజధాని కావాలి. దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు ఎమోషనల్గా, అన్ని రకాలుగా కనెక్ట్ అయిన హైదరాబాద్ను వదులుకొని మనం సెపరేట్గా ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం. అలా ఏర్పడిన తర్వాత మనకొక రాజధాని కావాలి. దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి, మనకు లేదు.
దానిని నిర్మిస్తామని అంతకు ముందు 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మీరు ఆ ప్రభుత్వం చేసిన అవినీతి మీద దర్యాప్తు చేయొచ్చు. కానీ రాజధాని కట్టడం ఆపకూడదు. మీరేం చేశారు? దర్యాప్తు దారి మళ్లించారు. రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు. రాజధానిని ఆపేశారు. దానివల్ల మీరు మూలన పడ్డారు. ఇప్పటికీ మూల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా, అదే విషాన్ని పట్టుకొని తలా కొంత చిమ్ముతున్నారు, మీకున్న మీడియా ద్వారా.
© APTG360. All Rights Reserved.