ఆంధ్రప్రదేశ్లో ‘తల్లికి వందనం’ పేరుతో ప్రకటించిన పథకం ఇప్పుడు తల్లుల కోసం కాదు, తల్లుల్ని మోసం చేయడానికి అని ప్రజలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, “ఒక పిల్లాడికి రూ.15 వేలు, ఇద్దరైతే రూ.30 వేలు… నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తాం” అని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కాగితాల మీద మాత్రమే మిగిలాయి.
రాష్ట్రంలో 87 లక్షల మందికి పైగా విద్యార్థులున్నారు. వీరందరికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే దాదాపు రూ.13 వేల కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.8,745 కోట్లు మాత్రమే. అంటే 30 లక్షల మంది విద్యార్థులకు ఈ సాయం ఇవ్వకుండా మోసం చేయనున్నారన్న విషయం సూటిగా చెప్పకపోయినా స్పష్టంగా అర్థమవుతోంది.
మరీ దారుణం ఏంటంటే, ఇచ్చే మొత్తం రూ.15 వేలంటే సరే అని తల్లులు ఆలోచిస్తే… ఇప్పుడు అదే సర్కార్, “రూ.13 వేలే ఇస్తాం” అంటూ మాట మార్చింది. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే. పైగా ఈ మొత్తం కూడా ఒకేసారి ఇస్తామా? లేక తంటాలు పెట్టేలా విడతలుగా ఇస్తామా? అనే విషయమై కూడా ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
గత ఏడాది ఈ పథకం పూర్తిగా నిలిపివేశారు. ఈ ఏడాది కూడా నిధుల కొరత పేరుతో పిల్లల సంఖ్యను తక్కువగా చూపించి, తల్లుల జేబులకు ఏమీ నిండకుండా చేయాలని చూస్తున్నారు. అసలు ప్రభుత్వం చెప్పిన విద్యార్థుల గణాంకాలు లెక్కలే సరైనవి అయితే – ఇచ్చే నిధులు సరిపోవు. నిజంగా ఇవ్వాలనుకుంటే తగినంత నిధులు కేటాయించాలి కదా?
ఇది స్పష్టంగా ఒక రాజకీయ మోసం. ఎన్నికల సమయంలో ప్రజల నుండి ఓట్లు వేటకొచ్చేలా హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని నెరవేర్చలేక పోయే స్థితిలో ప్రభుత్వం ఉంది. ‘‘ఇక పిల్లలు కనండి… ప్రతి ఒక్కరికి ‘తల్లికి వందనం’ ఇస్తాం’’ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తల్లుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.
ప్రస్తుతం తల్లుల బాధ స్పష్టంగా కనిపిస్తోంది. “రెండు సంవత్సరాల హామీకి రూ.30 వేలు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఇలాంటి డ్రామాల్ని సంక్షేమ పథకంగా ఎలా చెప్పగలరు?” అని వారు నిలదుస్తున్నారు.
ఒకవేళ కేంద్రం గణాంకాల ప్రకారం విద్యార్థుల సంఖ్యను తీసుకుంటే… అది కూడా సరిపోదని తెలిసేలా నిధులు కేటాయించకుండా, అర్థం కాని లెక్కలతో మోసం చేయడమే జరుగుతోంది. గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు ఉన్నదంతా వినిపించే మాటలే తప్ప, అమలులో ఏమీ కనిపించటం లేదు..
ఈ పరిస్థితిలో ‘తల్లికి వందనం’ అనే పథకం ప్రజలకు మేలు చేయడం కాదు… వాళ్ల నమ్మకాన్ని మిగిల్చే మోసంగా మారుతోంది. నిజంగా ప్రజల శ్రేయస్సు కోరితే, చంద్రబాబు ప్రభుత్వం నిధులు పూర్తిగా విడుదల చేసి, ప్రతి తల్లికి హక్కుగా రావలసిన మొత్తాన్ని ఖాతాల్లో వేయాలి. లేదంటే ఇది మరోసారి అధికారంలోకి రావడానికే ఇచ్చిన నాటకీయ వాగ్దానం అనిపించకుండా ఉండదు.
© APTG360. All Rights Reserved.