నడిగర్ సంఘం భవనానికి అడ్డు వస్తుంది.. మళ్లీ మూడేళ్లూ మేమే బాధ్యత వహిస్తాం: హీరో విశాల్
నడిగర్ సంఘానికి సంబంధించి ఎన్నికల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, భవనం నిర్మాణ పనుల్లో అంతరాయం తలెత్తకుండా చూడటానికే మళ్లీ మూడేళ్ల పాటు ప్రస్తుత కమిటీనే కొనసాగించాలని నిర్ణయించామని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్ స్పష్టం చేశారు.
మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్కు స్పందిస్తూ, విశాల్ అఫిడవిట్ దాఖలు చేశారు. “భవన నిర్మాణ పనులు ఇప్పటికే 60% పూర్తయ్యాయి. ఇది సుమారు రూ. 25 కోట్ల ప్రాజెక్ట్. ఇలాంటి సమయాల్లో ఎన్నికలు జరిపితే పనులకు ఆటంకం వస్తుంది,” అని ఆయన పేర్కొన్నారు.
అలాగే, 2024 సెప్టెంబర్ 8న జరిగిన సర్వసభ్య సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా ప్రస్తుత కమిటీకి మరో మూడేళ్ల పొడగింపు మంజూరు చేశారని వివరించారు. అయితే, ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ నటుడు నంబిరాజర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారించిన కోర్టు, నడిగర్ సంఘానికి నోటీసు జారీ చేసింది.
“ఈ పిటిషన్ వెనుక వ్యక్తిగత ప్రయోజనాలే ఉన్నాయని, నడిగర్ సంఘ అభివృద్ధికి ఇదే క్షణం కీలకం. మేము బాధ్యతలో లేకుంటే, ఈ భవన నిర్మాణం నిలిచిపోతుంది,” అంటూ విశాల్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.