కన్నడపై కమల్ హాసన్ వ్యాఖ్యలు వివాదాస్పదం – కర్ణాటక హైకోర్టు తీవ్ర అసంతృప్తి
తమిళ నటుడు కమల్ హాసన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెద్దగా చర్చకు దారితీశాయి. ఆయన “కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది” అని చెప్పడం వల్ల కన్నడ ప్రజలు నొచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
కమల్ హాసన్ నటించిన థగ్లైఫ్ అనే సినిమా విడుదలను కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిలిపివేసింది. దాంతో కమల్ హాసన్ హైకోర్టును ఆశ్రయించి సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. అయితే కోర్టు విచారణలో కమల్ హాసన్పై న్యాయమూర్తి నాగప్రసన్న గారు మండిపడ్డారు.
కోర్టు మాట్లాడుతూ, ‘‘మీరు ఎంత ప్రముఖ నటుడైనా సరే, ప్రజల మనోభావాలను గౌరవించాలి. అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? మీరు చరిత్రకారులా? భాషా నిపుణులా? ఈ వ్యాఖ్యలతో ప్రజల్లో ఉద్రిక్తత పెరిగింది. క్షమాపణ చెబితే ఈ సమస్య తేలికగా ముగిసేది కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘భాష, భూమి, నీరు ఇవన్నీ ప్రజలకు ఎంతో విలువైనవి. ప్రజల మనసును బాధపెట్టేలా మాట్లాడకూడదు’’ అని కోర్టు స్పష్టంగా చెప్పింది.
ఇప్పటికే కమల్ హాసన్ ఈ వ్యవహారంపై ఎలాంటి క్షమాపణ చెబుతారా అనే విషయం స్పష్టంగా తెలియలేదు. అయితే కోర్టు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.