మమ్ముట్టి ఇంట్లో విషాదం – మామ పీఎస్ అబు కన్నుమూత
మలయాళ సినీ హీరో మమ్ముట్టి కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మామ, భార్య సుల్ఫత్ కుట్టి తండ్రి పీఎస్ అబు (వయసు 92) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అబు గారు ఇక లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు సుల్ఫత్తో పాటు నలుగురు సంతానం ఉన్నారు.
ఈ విషాద వార్తతో మమ్ముట్టి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
దురదృష్టకరంగా ఇదే సమయంలో మరో మలయాళ సీనియర్ హీరో మోహన్లాల్ కుటుంబంలో కూడా విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనమామ గోపీనాథ్ నాయర్ మంగళవారం అనారోగ్యంతో మరణించారు. ఒకే వారం వ్యవధిలో ఇద్దరు స్టార్ హీరోల ఇళ్లలో దు:ఖకరమైన ఘటనలు జరగడం సినీ వర్గాల్లో తీవ్ర సంతాపాన్ని కలిగిస్తోంది.
మమ్ముట్టి 1971లో సినీ రంగంలోకి వచ్చి ఇప్పటివరకు 300కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. ఇటీవల ఆయన నటించిన భ్రమయుగం, టర్బో, బజూకా సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదుగుతున్నారు.