వార్ 2 తెలుగు డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజు ఎంట్రీ – సౌత్లో పోటీని లెక్కలోకి తీసుకుంటూ కొత్త వ్యూహం
బాలీవుడ్ బిగ్ యాక్షన్ మూవీ ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా, కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా, ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా భారీగా విడుదల కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఎవరు విడుదల చేస్తారనే విషయంలో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. మొదట యష్ రాజ్ సంస్థ ఈ సినిమాను తెలుగులో తామే విడుదల చేయాలని ప్లాన్ చేసింది. కానీ, అదే టైంలో రజనీకాంత్, నాగార్జున కలిసి నటిస్తున్న ‘కూలీ’ అనే సినిమా కూడా రిలీజ్ అవ్వడంతో పోటీ ఎక్కువగా ఉంటుందని భావించారు. అందుకే తమ వ్యూహాన్ని మార్చారు. సౌత్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నందున, వార్ 2 కి అంతగా థియేటర్లు దొరకకపోయే అవకాశముందన్న ఆందోళనతో ముందే జాగ్రత్త పడుతున్నారు.
ఇప్పుడు యష్ రాజ్ ఫిలింస్ వార్ 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలని కాకుండా, ముంబయి నుంచే థియేటర్ల యజమానులతో డైరెక్ట్గా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా డీల్ సెట్ అవుతుండగా, ఉత్తరాంధ్ర హక్కులను మాత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంస్థకు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఇక చివరికి వార్ 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్ల ద్వారా రిలీజ్ చేయాలా లేక తమే విడుదల చేయాలా అనే నిర్ణయం ఇంకా అధికారికంగా తీసుకోలేదు. అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని, సినిమాను బలంగా ప్రమోట్ చేయాలని యష్ రాజ్ సంస్థ భావిస్తోంది. మరోవైపు వార్ 2 విడుదల సమయంలో కూలీ వంటి పెద్ద సినిమాలు వస్తుండటంతో పోటీ మరింత రసవత్తరంగా మారబోతోంది.